శ్రీమద్రామాయణం – అరణ్యకాండ – 37 & 38


*శ్రీమద్రామాయణం*

*అరణ్యకాండ – 37*

*[ఏతౌ పాదౌ మయా స్నిగ్ధౌ శిరోభిః పరిపీడితౌ*
*ప్రసాదం కురు మే క్షిప్రం వశ్యో దాసో అహం అస్మి తే ||]*

ఏడుస్తూ ఉన్న సీతమ్మని చూసిన ఆ రావణుడు “నీ పాదాలు పట్టుకుంటున్నాను సీతా! నా కోరిక తీర్చి నన్ను అనుగ్రహించు” అన్నాడు. (రావణుడు తెలిసి పట్టుకున్నా తెలియక పట్టుకున్నా, శిరస్సు వంచి సీతమ్మ పాదాలు పట్టుకున్నాడు కనుక, సీతమ్మని ఇన్ని మాటలు అన్నా కొంతకాలమైనా బతికాడు). అప్పుడు సీతమ్మ, తనకి రావణుడికి మధ్యలో ఒక గడ్డిపరకని అడ్డుగా పెట్టి “రాముడు ధర్మాత్ముడు. దీర్ఘమైన బాహువులు ఉన్నవాడు. విశాలమైన కన్నులున్నవాడు. ఆయన నా భర్త. నా దైవం. ఇక్ష్వాకు కులంలో పుట్టి, సింహం వంటి మూపు ఉండి, లక్ష్మణుడిని తమ్ముడిగా కలిగిన రాముడి చేతిలో ప్రాణములు పోగొట్టుకోడానికి సిద్ధంగా ఉండు రావణా! నువ్వే కనుక రాముడి సన్నిధిలో నన్ను ఇలా అవమానించి ఉంటే, ఈ పాటికి నువ్వు ఖరుడి పక్కన పడుకొని ఉండేవాడివి. నీ ఆయువు అయిపోతుంది. నీ ఐశ్వర్యము పోతుంది. నీ ఓపిక అయిపోతుంది. నీ ఇంద్రియాలు కూడా పతనమయిపోతాయి. నీ లంకా పట్టణం విధవగా నిలబడడానికి సిద్ధంగా ఉంది. ఇవన్నీ నువ్వు చేసిన పని వల్ల భవిష్యత్తులో జరుగబోతున్నాయి. నీటి మీద పట్టే నాచుని తినే నీటికాకిని, నిరంతరం రాజహంసతో కలిసి క్రీడించడానికి అలవాటుపడిన హంస చూస్తుందా? రాముడిని చూసిన కన్నులతో నిన్ను నేను చూడనురా పాపీ. అవతలకి ఫో” అన్నది.

ఈ మాటలకి ఆగ్రహించిన రావణుడు “నీకు 12 నెలలు సమయం ఇస్తున్నాను. ఈలోగా నీ అంతట నువ్వు బుద్ధి మార్చుకొని నా పాన్పు చేరితే బతికిపోతావు. అలాకాకపోతే 12 నెలల తరువాత నిన్ను నాకు అల్పాహారంగా పెడతారు” అని చెప్పి, భయంకరమైన స్వరూపం కలిగిన రాక్షస స్త్రీలని పిలిచి “ఈమెని అశోక వనానికి తీసుకు వెళ్ళండి. ఆమె చుట్టూ మీరు భయంకరమైన స్వరూపాలతో నిలబడి, బతకడానికి కావలసిన ఆహారాన్ని, నీళ్ళని ఇస్తూ, శూలాలవంటి మాటలతో ఈ సీతని భయపెట్టి నా దారికి తీసుకురండి. ఇక తీసుకువెళ్ళండి” అన్నాడు. వికృత నేత్రములు కలిగిన ఆ రాక్షస స్త్రీలు చుట్టూ నిలబడి భయపెడుతుంటే, అశోకవనంలో శోకంతో ఏడుస్తూ ఆ సీతమ్మ ఉంది.

ఇటుపక్క రామచంద్రమూర్తి మాంసం పట్టుకుని వస్తుంటే, విచిత్రంగా వెనకనుంచి ఒక నక్క కూత వినబడింది. అలాగే రాముడిని దీనంగా చూస్తూ అక్కడున్న మృగాలన్నీ ఎడమ వైపు నుండి ప్రదక్షిణంగా తిరిగాయి. ఈ శకునాలని చూసిన రాముడు, సీతమ్మకి ఏదో కీడు జరిగిందని భావించి గబగబా వస్తుండగా ఆయనకి ఎదురుగా లక్ష్మణుడు వచ్చాడు. లక్ష్మణుడిని చూడగానే రాముడి పై ప్రాణాలు పైనే ఎగిరిపోయాయి. అప్పుడాయన లక్ష్మణుడితో “సీతని వదిలి ఎందుకు వచ్చావు? సీత ప్రమాదంలో ఉందని నేను అనుకుంటున్నాను. సీత క్షేమంగా ఉంటుందా? బతికి ఉందా? నాకు నమ్మకం లేదు. ఎందుకంటే నేను ఖర దూషణులని సంహరించాక రాక్షసులు నా మీద పగబట్టారు. మారీచుడు మరణిస్తూ ‘హా సీతా! హా లక్ష్మణా!’ అన్నాడు.”

“సీత నిన్ను నిగ్రహించి పంపి ఉంటుంది. అందుకని నువ్వు వచ్చావు. నువ్వు వచ్చేశాక సీతని ఆ రాక్షసులు అపహరించడమైనా జరిగి ఉంటుంది లేదా ఆమె కుత్తుక కోసి, ఆమెని తినెయ్యడం అయినా జరిగి ఉంటుంది. లక్ష్మణా! నువ్వు ఇలా వస్తావని నేను ఊహించలేదు. నువ్వు రాకుండా ఉండి ఉండవలసింది. ఏ ముఖం పెట్టుకొని నేను అయోధ్యకి వెళ్ళను? అందరూ వచ్చి సీతమ్మ ఏది అని అడిగితే, నేను ఏమని చెప్పుకోను? ‘అరణ్యవాసానికి తనని అనుగమించి వచ్చిన సీతమ్మని రక్షించుకోలేని పరాక్రమహీనుడు రాముడు’ – అని అందరూ చెప్పుకుంటుంటే, ఆ మాటలు విని నేను ఎలా బతకను? నేను అసలు వెనక్కి రానే రాను. సీత ఆశ్రమంలో కనపడకపోతే నా ప్రాణాలు విడిచిపెట్టేస్తాను.”

“ఏ సీత యొక్క ఓదార్పు చేత 13 సంవత్సరాల అరణ్యవాసాన్ని క్షణములా గడిపానో, ఆ సీత నా కంటపడనప్పుడు నాకు రాజ్యం అక్కరలేదు. అంతఃపుర భోగములు అక్కరలేదు. నువ్వు అయోధ్యకి వెళ్ళి, నేను చెప్పానని చెప్పి, భరతుడిని పట్టాభిషేకం చేసుకొని రాజ్యం ఏలమన్నానని చెప్పు. నా తల్లి కౌసల్యని సేవించు. నేను అయోధ్యకి తిరిగొస్తే, జనకుడు నన్ను చూసి “రామా! నీకు కన్యాదానం చేశాను కదా! ఏదయ్యా సీతమ్మ?” అని అడుగుతారు. అప్పుడు నేను జనకుని ఏ ముఖంతో చూడను? సీతని వదిలి రావద్దని నేను నిన్ను ఆజ్ఞాపించాను? కానీ నా ఆజ్ఞని పాటించకుండా సీతని వదిలి నువ్వు ఒక్కడివీ ఎందుకు వచ్చావు?” అన్నాడు.

*శ్రీమద్రామాయణం – అరణ్యకాండ – 37 – సంపూర్ణం*

*శ్రీమద్రామాయణం*
*
*అరణ్యకాండ – 38*

అప్పుడు లక్ష్మణుడు “అన్నయ్యా! నా అంత నేనుగా సీతమ్మని విడిచిపెట్టి రాలేదు. నీ మాటని పాటిద్దామని ప్రతిక్షణం సీతమ్మ దగ్గరే ఉండి జాగ్రత్తగా కాపు కాశాను.”

*[ఆర్యేణ ఏవ పరిక్రుష్టం – పరాక్రుష్టం – హా సీతే లక్ష్మణ ఇతి చ |*
*పరిత్రాహి ఇతి యత్ వాక్యం మైథిల్యాః తత్ శ్రుతిం గతం ||]*

“కానీ ఎప్పుడైతే అరణ్యంలోనుంచి నీ గొంతుతో ‘హా సీతా! హా లక్ష్మణా!’ అన్న మాటలు సీతమ్మ విన్నదో, నీయందు ఉన్నటువంటి అపారమైన ప్రేమ చేత భయవిహ్వల అయిపోయింది. అప్పుడు సీతమ్మ ఏడుస్తూ, లక్ష్మణా వెళ్ళు, అని నన్ను ఒకటికి పదిమార్లు తొందరచేసింది. కానీ మా అన్నయ్య అలా నీచంగా ‘రక్షించండి’ అని ఒక్కనాటికి అరవడు, ఇది రాక్షస మాయ అని సీతమ్మకి చెప్పాను. కానీ ‘నువ్వు భరతుడితో కలిసి కుట్ర చేసి, నన్ను పొందడానికి రాముడి వెనకాల అరణ్యవాసానికి వచ్చావు’ అని సీతమ్మ నన్ను ఒక కఠినమైన మాట అంటే, నేను ఇంక తట్టుకోలేక బయలుదేరి వచ్చేశాను. నాయందు ఏ దోషము లేదన్నయ్యా, నన్ను మన్నించు” అన్నాడు.

అప్పుడు రాముడు “నువ్వు ఎన్నయినా చెప్పు లక్ష్మణా, సీతని ఒక్కదాన్ని అరణ్యంలో విడిచిపెట్టి నువ్వు ఇలా రాకూడదు. నా మాటగా రాక్షసుడి మాట వినపడితే, సీత నిన్ను ఒకమాట అని ఉండవచ్చు. అంతమాత్రాన సీతని విడిచి వచేస్తావా? ఇప్పుడు సీత ఎంత ప్రమాదంలో ఉందో. నువ్వు కోపానికి లోనయ్యావు. అందుకని సీతని విడిచిపెట్టి వచ్చేశావు. ఇప్పుడు నేను ఏమి చెయ్యను?” అని అంటూ ఆ పర్ణశాల ఉండే ప్రదేశానికి చేరుకున్నారు.

రాముడు ఆ పర్ణశాలలో అంతా చూశాడు. కానీ సీతమ్మ ఎక్కడా కనపడలేదు. అప్పుడాయన ఆ చుట్టుపక్కల అంతా వెతికాడు. దగ్గరలో ఉన్న పర్వతాలకి వెళ్ళాడు, నదుల దగ్గరికి వెళ్ళి చూశాడు, అక్కడే ఉన్న జింకల దగ్గరికి వెళ్ళాడు. చుట్టూ ఉన్న జంతుజాలాన్ని, పక్షుల్ని, చెట్లని అడిగాడు. అలా ఒక ఏనుగు దగ్గరికి వెళ్ళి “ఓ గజరాజమా! నీ తొండం ఎలా ఉంటుందో సీత జడ కూడా అలానే ఉంటుంది. నీకు తెలిసే ఉంటుంది సీత ఎక్కడుందో. నాకు చెప్పవా?” అన్నాడు. చెట్ల దగ్గరికి వెళ్ళి “సీత ఎక్కడుందో మీకు తెలిసే ఉంటుంది. నాకు నిజం చెప్పరా?” అని ప్రార్ధించాడు. అక్కడే ఉన్న జింకల దగ్గరికి వెళ్ళి “సీత మీతో ఆడుకునేది కాదా! సీతకి ప్రమాదం జరిగినప్పుడు మీకు తెలిసి ఉంటుంది. నాకు సీత ఎక్కడ ఉందో చెబుతారా?” అన్నాడు. అలాగే అక్కడ కూర్చొని ఏడుస్తూ “అయ్యో! రాక్షసులు వచ్చి సీత యొక్క పీక నులిమేసి, ఆమె రక్తాన్ని తాగేసి, మాంసాన్ని భక్షిస్తుంటే, ‘హా! రామా, హా! రామా’ అని భయంతో ఎంతగా అరిచి ఉంటుందో! ఎంత అస్త్ర-శస్త్ర సంపద తెలిసి మాత్రం నేను ఏమీ చెయ్యగలిగాను? సీతని కాపాడుకోలేకపోయాను” అని ఏడుస్తున్నాడు.

*శ్రీమద్రామాయణం – అరణ్యకాండ – 38 – సంపూర్ణం*

Leave a comment